మిరప పంట వేసే విధానం |
మిరప పంటకు మెత్తటి దుక్కి అవసరం. భూమిని 3-4 సార్లు బాగా దున్ని రోటవేటర్ తో చదును చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. బిందు సేద్యం ద్వారా నీరందించే రైతులు ప్రధాన పొలంలో 4 లేదా 5 అడుగుల వెడల్పుతో ఎత్తు బోదెలను, తయారు చేసి బిందు సేద్యం (లేటరల్ పైపులను బోదెలపై పరచుకోవాలి. తర్వాత మల్చింగ్ షీటును పరిచి బోదెకు ఇరువైపులా మట్టివేసి మల్చింగ్ షీటు గాలికి కదలకుండా చేయాలి. తర్వాత లేటరల్ పైపునకు రెండు వైపులా 30 సెం. మీ. దూరంలో షీటుకు రంధ్రం చేయాలి. అంటే ఒక బోదె మీద జంట సాళ్లు వస్తాయి. మొక్కల మధ్య 2 అడుగులు, సాళ్ల మధ్య 30 సెం. మీ. చొప్పున ఎడం ఉంచాలి. ప్రతి బోదె మీద జంట సాళ్ల పద్ధతిలో మిరపను నాటాలి. మల్చింగ్ షీట్ కింద లేటరల్ పైపు ద్వారా విడుదలైన నీటి బిందువులతో బోదె మొత్తం పదునవుతుంది. కేవలం 30 నుంచి 40 నిమిషాల వరకు మాత్రమే రోజూ డ్రిప్ ద్వారా నీరందించాలి.
ఎరువుల :
సేంద్రియ, రసాయన ఎరువులను సమన్వయంతో వాడితే భూసారం క్షీణించకుండా అధికోత్పత్తిని సాధించవచ్చు.
అందువల్లే సేంద్రియ, రసాయన ఎరువులను సమీకృతంగా వాడాలి.
సేంద్రియ ఎరువులలో పశువుల ఎరువు అతి ముఖ్యమైనది. దీన్ని ఏటా ఎకరాకు 10 టన్నులు వేయాలి.
సేంద్రియ ఎరువు అందుబాటులో లేనప్పుడు పచ్చిరొట్ట పైర్లు పెంచి, పూత దశలో భూమిలో కలియదున్నాలి.
జనుము, పిల్లిపెసర, అలసంద, పెసర వంటివి. అనువైనవి. వీటితో పాటు ఎకరాకు ఒక క్వింటా వేపపిండిని
వేస్తే మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తిని సాధించడమే గాక వేరు పురుగులను కూడా నివారించవచ్చు.
దిగుబడి
ఆఖరి దుక్కిలో ఎకరాకు 30 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు..
అంటే 67 కిలోల యూరియా, 150 కిలోల సూపర్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
డ్రిప్ ద్వారా ఎరువులను పంపటాన్ని 'ఫెర్టిగేషన్' అంటారు. ఈ పద్ధతిలో కేవలం నీటిలో కరిగే
ఎరువులను (యూరియా, ఫాస్ఫారిక్ యాసిడ్, అమోనియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్ మొదలైనవి)
మాత్రమే పంపాలి.. నీటిలో కరగని ఎరువులను కొంతమంది రైతులు ఒకరోజు ముందుగా నానబెట్టి
మరుసటి రోజు డ్రిప్ ద్వారా పంపించే పద్ధతిని అవలంబిస్తున్నారు. దీనివల్ల డ్రిప్పర్లు మూసుకుపోయి
డ్రిప్ సిస్టం త్వరగా పాడైపోతుంది. మల్చింగ్ విధానంతో పాటు డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందించి,
సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే సగటున ఎకరాకు 35-40 క్వింటాళ్ల ఎండుమిరప దిగుబడి
సాధించవచ్చు.